Thursday, June 29, 2006


ఇదేనా ప్రజాస్వామ్యం?


తొలిదశలో ఎన్నికలు జరిగిన 11 జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగిస్తుంది. 2001లో తెదేపా హయాంలో జరిగిన వాటితోపోలిస్తే ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి
---వైయ్యస్‌.


స్థానిక సంస్థల తొలిదశ పోలింగ్‌లో అధికార పార్టీ అన్ని రకాల అక్రమాలకూ పాల్పడి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ స్వీయ ఆదేశాల మేరకే అన్నిజిల్లాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు రెచ్చిపోయాయి.
---చంద్రబాబు


కాంగ్రెస్‌ బీభత్సకాండ *
కడప, నల్గొండ జిల్లాల్లో బాంబుల మోత *
సీమలో యథేచ్ఛగా బూత్‌ల ఆక్రమణ *
దేశం ఏజెంట్ల తరిమివేత *
పోలింగ్‌ ఏజెంటుగా ఎమ్మెల్యే సుజాతమ్మ *
గన్‌మెన్‌తో గౌరు చరిత 'పర్యవేక్షణ' *
డోన్‌లో తెదేపా తిరుగుబాటు నేతల హత్య *
పలుచోట్ల లాఠీఛార్జీలు, గాలిలోకి కాల్పులు *
వేలాది ఓట్లు గల్లంతు *

గుర్తింపు పత్రాల్లేక వెనుదిరిగిన ఓటర్లు. 25 చోట్ల రీపోలింగ్‌!

ఎమ్మెల్యేలు పోలింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరించకూడదు *
నాయకులు గన్‌మెన్‌ను వెంటబెట్టుకుని పోలింగ్‌ కేంద్రాల వద్దకు రాకూడదు *
ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు వీలు కల్పించాలి *
పోలీసులు, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి *


ఇవన్నీ కాగితాల్లో ఉండే ఎన్నికల నిబంధనలు. మరి బుధవారం 11 జిల్లాల్లో స్థానిక ఎన్నికల పోలింగ్‌ ఎలా జరిగింది?

కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని కోయిలకొండ పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పోలింగ్‌ ఏజెంట్‌గా కూర్చున్నారు *
అదే జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గౌరు చరిత బ్రాహ్మణకొట్కూరు పోలింగ్‌ కేంద్రం వద్దకు గన్‌మెన్‌తో సహా వచ్చి పోలింగ్‌ను 'పర్యవేక్షించారు' *
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప, హోంమంత్రి జానారెడ్డి సొంత నియోజకవర్గం చలకుర్తి బాంబుల మోతతో దద్దరిల్లాయి *

కాంగ్రెస్‌ కార్యకర్తలు గోడ కూలగొట్టి మరీ లోనికి ప్రవేశించి బలవంతంగా ఓట్లేసుకున్నారు. పలుచోట్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు దగ్గరుండి పోలింగ్‌ను పర్యవేక్షించారు. పోలీసులు, పోలింగ్‌ సిబ్బంది అధికార పార్టీకి యథాశక్తి సహకరించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలు పదుల సంఖ్యలో వాహనాలను ఉపయోగించారు.

కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌లో ఒకే పార్టీకి ఓట్లు పడుతున్నాయని ఆగ్రహించిన పోలింగ్‌ క్లర్క్‌ బ్యాలెట్‌ బాక్సులో ఇంకు పోశారు.

వేమవరంలో రెండు బూత్‌లను కాంగ్రెస్‌ వారు ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. బంటుమిల్లిలో బ్యాలెట్‌ పత్రాలు పట్టుకుపోవడానికి ప్రయత్నించారు. విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి.

కడప జిల్లాలో తెలుగుదేశానికి పోలింగ్‌ ఏజెంట్లే లేని పరిస్థితిని అధికార పార్టీ సృష్టించగా... అనంతపురం జిల్లాలో చాలాచోట్ల వారిని పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లనీయలేదు. ప్రత్యేకించి రాయలసీమలో అధికార యంత్రాంగం కాంగ్రెస్‌కు పూర్తిగా సహకరించింది.

ప్రజాస్వామ్య మంటే ఇదేనా? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యక దేశం మనది మరి. ఇంత జరిగినా 72.4 శాతం పోలింగ్‌ నమోదయ్యిందట. ఏది నిజమో పైవాడి కెరుక.

Sunday, June 11, 2006


మాంసాహారం


ప్రసాద్‌ గారి చరసాల(charasala)లో మాంసాహారం గురించి చదివాక ఆయన ఆవేదన తెలిసింది.

స్వాతి గారన్నట్లు అవసరం, కోరిక, విచక్షణ లను అదుపులో పెట్టుకోగలిగేది మానవుడు మాత్రమే. వాడెవడో చెయ్యటం లేదు, వీడెవడో చెయ్యటం లేదు అనటం కన్నా ముందు మనం నిఝంగా మారితే, మారి సంతోషంగా వుంటే ... ఆ మనని చూసి మారే వారే ఎక్కువ, బోధనలవల్ల మారేవారి కన్నా. జంతు పరిరక్షణ, ఇంకోటో, మరింకో పేరుతోనే ప్రపంచమంతా వుండే ఈ జంతు ప్రేమ సంఘాల్లోని సభ్యులెంత మంది శాకాహారులో మీకేమైనా తెలుసా? వీళ్ళందరూ కుక్కకు బిస్కట్టో (లేదా మరోటో) ఆశ పెట్టి యాక్ట్‌ చేయిస్తే వూరు కోరు తెలుసా, అది జంతు హింసట!

నారాయణరావు గారు డైరెక్టుగా "నేను మానేశాను, నా కడుపు చచ్చిన/చంపిన జంతువులకు సమాధులు కాకూడదని" అన్నారు. గుడ్‌. పెద్దవారు మీకు తెలియదని కాదు, ఇష్టంతో చేసే పని వలన ఫలితం వుంటుంది కానీ, అయిష్టంతో చేస్తే కాదు - యోగమైనా, భోగమైనా. మీరు ఆ రీతిగా సెలవిచ్చుంటే బాగుండేది. మీ దగ్గరినుండి మరికొన్ని విషయాలు నేర్చుకొన్నట్లయ్యేది.

రోహిణీ కుమార్‌ గారూ, హిట్లర్‌ ఆ ఒక్కటే కాదు చాలా మంచి పనులు చేశాడు. చూసేవాడి ఆలోచనల బట్టి ఎదుటివాడు అర్థమౌతాడంట, అలాగే హిట్లర్‌ను విలన్‌గా చూసే కొద్దీ పాపాలు బోల్డన్ని కనబడుతాయి. నాణేనికి రెండోవైపు చూడడం ప్రారంభించారు. కంగ్రాట్స్‌. ఇంకొకటి, దూడ తాగితే మహా అయితే రోజుకి మూడు, నాలుగు లీటర్లు తాగుతుందా...? ఇప్పటి ఆవులు లేదా గేదలు దగ్గర దగ్గర పది లీటర్ల పాలనిస్తాయి కదా ... మిగతా వాటినేం చేద్దామంటారు? I hope you got my point.

వెంకటరమణ గారి అ),ఆ) లకు:
జంతువులను చంపితే బాధ పడేవారి కన్నా (లేదా బాధపడే వారు లేరనుకున్నా)మనుషులను చంపితే బాధ పడేవారున్నారు కనుక జంతువులను చంపితే తప్పు లేదు, మనుషులను చంపితే తప్పే నంటారు. అయితే ఎవరూ ఆధారపడని అనాధలను, వృద్ధులను (మనుషులైనా సరే) చంపితే, చంపి ఉపయోగిస్తే (ఏదో రకంగా) తప్పులేదా? ఇంకపోతే, జంతువులే కాదు, చెట్లకు కూడా స్పందనలుంటాయని, బాధలుంటాయని (మానసికంగా కూడా) చాలా సార్లు నిరూపణయ్యింది. యజమాని చనిపోతే బాధపడి ఆహారాదులు మానేసి చనిపోయిని పెంపుడు జంతువులెన్నో!

ఇ),ఈ) ఈ విషయంలో మీతో పూర్తి గా ఏకీభవిస్తా, పని చేయించుకోవడానికీ, హింసించడానికీ చాలా తేడావుంది. అలాగే చనిపోయిన వాటిని (చంపిన వాటిని కాదు)వాడుకోవడంలోనూ తప్పులేదు.


ప్రసాద్‌ గారూ, మీ అభిప్రాయం మీరు చెప్పారు. కాదు చాలా చక్కగా వెలిబుచ్చారు. అబ్బా, అమ్మా అంటేనే, లేదా ఏడిస్తేనే మనకు అవతలి వ్యక్తి బాధపడుతున్నాడని తెలుస్తుంది, ఎందుకంటే మనమూ వారిలాంటి వారమే, మనకూ బాధ కలిగితే అలాగే ఏడుస్తాం కనక. కానీ మనకు తెలియని వేషభాషలూ, ఆచార వ్యవహారాలూ వున్నవాటి సంగతో? వాటి బాధను ఎక్స్‌ప్రెస్‌ చేసే విధానం మనకు అర్థం కాకపోతేనో? పెద్దవారు నారాయణరావు గారు లేదా వారిలాంటి అనుభవజ్ఞులేమైనా సలహా చెబుతారేమో .. తార్కికంగా. He knows a lot more. అలాగే ప్రకృతి నిర్ణయించిన ఆహార చక్రాన్ని నియంత్రించడనికి మనమెవరం? మనమేం చేసినా చేయక పోయినా, తన స్థితి అసమతౌల్యానికి గురైనప్పుడు ప్రకృతి తన సమతౌల్యనికి చేయవలసినదేదో అదే చేస్తుంది, జంతువులు బాధ పడవు, మనుషులు బాధపడతారు అనిమాత్రం చూడదు.

చివరగా నేను మాంసాహారినే కానీ మాంసం తినను చిన్నప్పటినుంచీ, ఒక్క కోడి గుడ్డు తప్ప.(అందుకే నన్ను ఎగ్గేరియన్‌ అంటారు). నేను ఒకప్పుడు చికెన్‌, మటన్‌ లాంటివి తినడానికి ట్రై చేసాను కానీ తినలేక పోయాను .. నాకెందుకో తినాలనిపించలేదు. అలాగే నాకు ఊహ తెలిసినప్పటినుంచీ పాలూ, కాఫీ, టీ కూడా తాగను - కానీ మజ్జిగ మాత్రం ఇష్టంగా తాగుతా.

మాంసాహారం తినటం వల్ల వచ్చే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. జంతువుల గురించి ఆలోచించకుండా, ముందు మన గురించి ఆలోచించండి - మన ఆరోగ్యం మనకు ముఖ్యం కదా! మనం మనకోసమే బతకాలి, అదీ పక్కవార్ని ఇబ్బంది పెట్టకుండా సుమా! మన తరువాతే ఎవరైనా. ఇది (సామాన్యులైన) మనందరికీ వర్తించే నిఝమైన నిజం.

Friday, June 09, 2006


మత మార్పిళ్లు


ఇటీవల భారత కొత్త రాయబారిని ఆహ్వానిస్తూ పోప్‌ బెనెడిక్ట్‌ చేసిన వ్యాఖ్యలు.

* "ఏ కారణంతోనూ - ప్రత్యేకించి జాతి, మతపరమైన లేదా సామాజిక స్థాయిని బట్టి పౌరులెవరూ ఎలాంటి విచక్షణకు గురికాకుండా భారత్‌ చూడాలి."

అంటే ప్రస్తుతం అలా జరగటం లేదనా? ఏ రకమైన విచక్షణ గురించి ఆయన అలా మాట్లాడు తున్నారు? మన లౌకిక, ప్రజాస్వామ్యిక రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల గురించి కానీ, పార్లమెంటు, సుప్రీం కోర్టు వంటివి వాటిని నిర్నిరోధంగా అమలు పరచడాన్ని గురించి ఆయనకు అవగాహన వుందా?

భారత దేశంలో హిందువుల జనాభా 80%, అయినప్పటికీ మన రాష్ట్రపతి ముస్లిం, ప్రధానమంత్రి సిక్కు, సర్వాధికారిణిగా వ్యవహరిస్తున్న సోనియా గాంధీ రోమన్‌ కాథలిక్‌ (అందులోనూ ఇటలీ దేశస్థురాలు)

* "మౌలిక హక్కుగా వున్న మతపరమైన స్వేచ్చపై విచక్షణపూరిత నియంత్రణలు విధిస్తూ చట్టాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి."

మోసంచేసి, బలవంతపెట్టి లేదా ప్రలోభ పరచి మత మార్పిళ్ళకు పాల్పడటాన్ని నిషేదిస్తూ కొన్ని రాష్ట్రాలు చట్టాలు చేయడం పోప్‌కు కలవరం కలిగించినట్లయింది. ఈ మథ్య రాజస్థాన్‌, నాలుగు దశాబ్దాల క్రితం మథ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలు చట్టవ్యతిరేక పద్ధతుల ద్వారా బలవంతంగా మతమార్పిళ్లు చేయడాన్ని నిషేధించాయి. జనమనోభావాల్ని దెబ్బ తీసేవిధంగా ఒక మతంలోంచి మరో మతంలోకి మార్పిళ్లు జరరపపడాన్ని నిషేధించి సామాజిక అలజడిని నిరోధించడానికే ఈ రాష్ట్రాలు ఇలాంటి చట్టాలు చేశాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

* "ఇవి రాజ్యాంగ విరుద్ధమైనవే కాకుండా నవభారత నిర్మాతల ఉన్నత ఆశయ, ఆదర్శాలకు వ్యతిరేకమైన అలంటి చర్యల్ని తిప్పికొట్టాలి."

ఈ ఒక్క విషయంలో మాత్రం యావత్భారతదేశం ఆయనతో ఏకీభవిస్తుంది. నిజానికి మతమార్పిడి నిరోధక చట్టాలు రాజ్యాంగ నిర్మాతల అభిమతానికి అనుగుణంగానే వున్నాయి. 25వ అధికరణంలో వుపయోగించాల్సిన పదజాలం పై రాజ్యాంగ సభలో తీవ్రస్థాయి చర్చ జరిగింది. "మతబోధన, ఆచరణ, ప్రచారం" అన్నది పౌరులందరి మౌలిక హక్కుగా వుండాలని క్రైస్తవ ప్రతినిధులు వాదించారు. ప్రచారం అన్న పదాన్ని తొలగించాలని అనేక మంది పట్టుబట్టారు. అంతేకాదు బలవంతంగానో, ప్రలోభపరిచో మత మార్పిడికి పాల్పడటం ఇప్పుడైనా, ఎప్పుడైనా చట్ట విరుద్ధమేనని, అందువల్ల మత మార్పిడులను నిషేధిస్తూ నిర్ధిష్ట నిబంధనలను పొందుపరచవలసిన అవసరం లేదని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తెలిపారు. చివరకు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ మత మార్పిళ్ల నియంత్రణ కోసం చట్టాలు చేసే అంశాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టాలన్న సూచనను అందరూ అంగీకరించారు.

* "భారత రాజ్యాంగంలోని 25(1) అధికరణంలో హామీ యిచ్చిన ప్రకారం ఒక మతానికి ప్రచారం కల్పించుకొనే హక్కు కల్పించడమంటే, ఇతరులను ఆ మతంలోకి మార్చేందుకు హక్కు కల్పించడమే" - రెవరెండ్‌ స్టెయినిస్లాస్‌

మథ్యప్రదేశ్‌ రాష్ట్రం చేసిన నిషేధ చట్టానికి వ్యతిరేకంగా స్టెయినిస్లాస్‌ తన పిటిషన్‌లో సవాలు చేశారు. కానీ ఆయన పై వాదన వీగిపోయింది. "వేరే మతానికి చెందిన వ్యక్తిని తన మతంలోకి మార్చే హక్కును పౌరుడికి 25(1) అధికరణ ఇవ్వడంలేదు. తన మతంలోని విశేషాంశాలను ప్రచారం చేసి, వ్యాప్తి చేసుకొనే స్వేచ్చ మాత్రమే యిస్తోంది. ఒకరికి ఎంత స్వేచ్ఛవుంటుందో మరొకరికీ అంతే స్వేచ్ఛవుంటుంది. అందువల్ల మరొకరిని తన మతంలోకి మార్చుకొనడం మౌలిక హక్కు ఎంత మాత్రం కాదు" అని అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

109 ఎకరాల వాటికన్‌లో మొత్తం 932 మంది నివాసం వుంటే, వారిలో 555 మంది మాత్రమే పౌరులు. వీరంతా రోమను కాథలిక్కులే. కానీ భారత్‌లో జనాభా 110 కోట్లకు పైమాటే. వీరంతా ప్రపంచంలోని ప్రధాన మతాలకు చెందిన వారే. ప్రపంచంలో అతి చిన్న దేశం, పైగా మత రాజ్యం వాటికనైతే, ప్రపంచంలో అతి పెద్ద లౌకిక, ప్రజాస్వామ్యిక దేశం భారత దేశం. ఇంతటి దేశానికి వాటికన్‌ ధర్మోపదేశం చేయాల్సిన పనిలేదు.

(ఈనాడులో ప్రముఖ పాత్రికేయులు ఎ. సూర్య ప్రకాశ్‌)